రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్

  • రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్
  • సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ
  • రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్ రెడ్డి కన్నంతా మెట్రో భూముల మీదే పడింది. ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ పక్కా ఉంటుంది” అని ఆరోపించారు.

మెట్రో సమీపంలో 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.30 వేల కోట్లు అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ భూములను తన అన్నదమ్ములు, బావమరుదులు, అల్లుళ్లకు కట్టబెట్టడానికే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దీని కోసం ప్రజలపై రూ.14 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.“కేసీఆర్ ప్రభుత్వం 72 కిలోమీటర్ల మెట్రోను బ్రహ్మాండంగా నిర్మించింది. ఎయిర్‌పోర్ట్ మెట్రో టెండర్లు కూడా పూర్తి చేసి, 2023 జూన్-జులైలోనే పనులు ప్రారంభించాల్సి ఉండగా, రేవంత్ రెడ్డి వచ్చి ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేశారు. ఇది తుగ్లక్ నిర్ణయం” అని కేటీఆర్ మండిపడ్డారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో కొనసాగి ఉంటే ఈ పాటికి పూర్తి అయి ఉండేదని చెప్పారు. భూసేకరణ సమస్య కూడా లేకుండా, ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసి ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలని ఆలోచన చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని, మళ్లీ మెట్రో పనులు ప్రారంభించాలంటే 2028లో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేయాల్సి ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR
Revanth Reddy
Hyderabad Metro Scam
Telangana Politics
Airport Metro Project
BRS Party

More Telugu News